Ticker posts

9/recent/ticker-posts

అంతర్జాతీయం

అంతర్జాతీయం 
ఇస్లామిక్ సైనిక కూటమి ఏర్పాటు
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు 34 దేశాలతో ఇస్లామిక్ సైనిక కూటమి ఏర్పాటైంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్ కేంద్రంగా ఈ సైనిక కూటమి పనిచేయనుంది. ఈ మేరకు సౌదీ అరేబియా డిసెంబర్ 14న ప్రకటన చేసింది. ఈజిప్ట్, ఖతార్, యూఏఈ, టర్కీ, మలేసియా, పాకిస్థాన్, నైజీరియా, సోమాలియా, మాలీ, చాద్, మాల్దీవులు, బహ్రెయిన్ తదితర దేశాలు ఈ కూటమిలో సభ్యులుగా ఉన్నాయి.

అంతర్జాతీయ పప్పుదినుసుల సంవత్సరంగా 2016
2016 సంవత్సరాన్ని అంతర్జాతీయ పప్పుదినుసుల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. పప్పుదినుసుల్లో ఉన్న మాంసకృత్తులు, పీచు, ఇతర పోషకాల గురించి ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల బాధ్యతను ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో)కు అప్పగించింది.

మిస్ వరల్డ్ - 2015గా మిరేయ రొయోమిస్ వరల్డ్-2015గా స్పెయిన్‌కి చెందిన 23 ఏళ్ల మిరేయా లలగున రొయో ఎంపికైంది. సాన్యా (చైనా) లో డిసెంబర్ 19న ముగిసిన పోటీల్లో రష్యాకు చెందిన సోఫియా నికిచ్చుక్, ఇండోనేసియాకు చెందిన మరియా హర్ఫాంటి వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

మిస్ యూనివర్స్-2015గా అలొంజ్ వుర్త్‌బాచ్
Current Affirs ఫిలిప్పీన్స్‌కు చెందిన పియా అలొంజ్ వుర్త్‌బాచ్ మిస్ యూనివర్స్-2015గా ఎంపికైంది. లాస్‌వెగాస్ (అమెరికా)లో డిసెంబర్ 21న ముగిసిన పోటీల్లో వుర్త్‌బాచ్ కిరీటం దక్కించుకోగా, కొలంబియాకు చెందిన అరియాడ్నా గ్విటెర్జ్ రెండో స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన ఒలివియా మూడో స్థానాన్ని దక్కించుకొంది. భారత్ నుంచి (2000) లారాదత్తా ఈ కిరీటాన్ని సాధించారు.

ఉగ్రవాద సంస్థల నిధుల కట్టడి తీర్మానానికి ఆమోదం
భయానక ఉగ్రవాద సంస్థలు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్), అల్‌కాయిదాలకు నిధులు అందే అన్ని మార్గాలనూ మూసేయడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలను భారీగా పెంచుతామని సభ్య దేశాలు ప్రతినబూనాయి. భద్రతామండలిలోని 15 సభ్యదేశాల ఆర్థిక మంత్రుల తొలి సమావేశాన్ని డిసెంబర్ 18న నిర్వహించారు. ఐఎస్, అల్‌కాయిదాలపై ఆంక్షలను పెంచడం, వాటికి నిధులు అందకుండా అడ్డుకోవడం, దాతృత్వ కార్యక్రమాల పేరిట జరిగే నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడం తదితర చర్యలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

మిస్ ఇరాక్‌గా షైమా అబ్దెల్ రహ్మాన్
ఇరాక్‌లో సుమారు నాలుగు దశాబ్దాల అనంతరం నిర్వహించిన మిస్ ఇరాక్ పోటీల్లో 20 ఏళ్ల షైమా అబ్దెల్ రహ్మాన్ విజేతగా నిలిచింది. భారీ బందోబస్తుతో డిసెంబర్ 19న నిర్వహించిన ఫైనల్స్‌లో స్విమ్‌సూట్, ఆల్కహాల్ వంటి ఆధునిక పోకడలకు తావివ్వలేదు. ఇరాక్ పురోగమిస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని విజేత షైమా తెలిపింది. ఇరాక్‌లో చివరిసారిగా 1972లో అందాల పోటీలు నిర్వహించారు.

ప్రధాని మోదీ రష్యా పర్యటన
Current Affirs రక్షణ రంగంతో పాటు పలు అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లారు. రెండ్రోజుల పర్యటన కోసం డిసెంబర్ 23న ఢిల్లీ నుంచి బయల్దేరి మాస్కో చేరుకున్నారు. డిసెంబర్ 24న మోదీ.. పుతిన్‌తో 16వ భారత్-రష్యా వార్షిక చర్చల్లో భాగంగా పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. భారత్-రష్యా సీఈవోల భేటీలో పాల్గొన్నారు. మాస్కోలో ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రసంగించారు.

జాతీయం
త్రివిధ దళాల వార్షిక సదస్సు
Current Affirs త్రివిధ దళాల వార్షిక సదస్సు ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య (కోచి వద్ద సముద్రంలో)లో డిసెంబర్ 15న జరిగింది. ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఉగ్రవాద నిర్మూలనా చర్యల్లో భాగంగానే పాకిస్థాన్‌తో చర్చల ప్రక్రియను తిరిగి ప్రారంభించినట్లు ప్రధాని తెలిపారు. దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఢిల్లీ బయట త్రివిధ దళాల వార్షిక సమావేశం జరగటం ఇదే తొలిసారి.

రెమిటెన్స్ పొందటంలో భారత్‌కి మొదటి స్థానం
రెమిటెన్స్ పొందుతున్న దేశాల్లో 2014 సంవత్సరానికి గానూ భారత్ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది భారత్ 7000 కోట్ల డాలర్ల (ప్రవాస భారతీయుల నుంచి పొందుతున్న డబ్బు) రెమిటెన్స్ పొందింది. ఈ మొత్తం దేశ జీడీపీలో 4 శాతంగా ఉంది. చైనా 6,400 కోట్ల డాలర్ల రెమిటెన్స్‌లతో రెండో స్థానాన్ని దక్కించుకొంది. ఫిలిప్పీన్స్ 2,800 కోట్ల డాలర్లు, మెక్సికో 2,500 కోట్ల డాలర్ల రెమిటెన్స్‌లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. 2014లో ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్స్‌ల మొత్తం 58,300 కోట్ల డాలర్లు కాగా, 2015గానూ ఈ మొత్తం 58,600 కోట్ల డాలర్లకు పెరగవచ్చని అంచనా.

పెట్రోలియం ఉత్పత్తులపై సుంకం పెంపు
కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 16 నుంచి పెట్రోలియంపై 30 పైసలు, డీజిల్‌పై రూ.1.17 చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచింది. దీంతో అదనపు, ప్రత్యేక ఎక్సైజ్ సుంకాలతో కలిపి లీటరు పెట్రోలుపై మొత్తం ఎక్సైజ్ సుంకం రూ.19.36కు, సాధారణ డీజిల్‌పై మొత్తం సుంకం రూ.11.83కు చేరింది.

వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్‌కు 97వ స్థానం ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ విడుదల చేసిన వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్ 97వ స్థానం దక్కించుకొంది. 2015 సంవత్సరానికి గానూ 144 దేశాలతో కూడిన జాబితాను ఫోర్బ్స్ డిసెంబర్ 17న ప్రకటించింది. జాబితాలో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలువగా, జర్మనీ (18), అమెరికా (22), రష్యా (81), చైనా (94) స్థానాల్లో ఉన్నాయి.

యాహూ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా ఆవుబీఫ్‌పై నిషేధం, గో రక్షణ, అసహనం.. తదితర వివాదాస్పద అంశాలపై ఆన్‌లైన్లో నెలకొన్న హంగామాకు నిదర్శనంగా ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2015’గా ఆవును యాహూ సంస్థ ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం బీఫ్‌పై నిషేధం ప్రకటించింది మొదలు భారత్‌లో ఆన్‌లైన్ చర్చలు, ‘దాద్రి’, అసహనంపై చర్చ వంటివి తమ నిర్ణయానికి కారణమని యాహూ తెలిపింది. ఆన్‌లైన్లో ఎక్కువమంది వెతికిన మహిళా సెలబ్రిటీగా వరుసగా నాలుగో ఏటా సన్నీ లియోన్ నిలవగా, పురుష సెలబ్రిటీగా సల్మాన్ ఖాన్ నిలిచాడు.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పలు బిల్లుల ఆమోదం
Current Affirs నవంబర్ 26న ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23తో ముగిశాయి. లోక్‌సభ 117గంటల 14 నిమిషాలు కొనసాగగా, రాజ్యసభ 60 గంటలకుపైగా కొనసాగింది. లోక్‌సభలో 13 బిల్లులు ఆమోదం పొందగా.. రాజ్యసభ 9 బిల్లులకే ఆమోదం తెలిపింది. 2016, ఏప్రిల్ 1 నుంచి అమలు చేద్దామనుకున్న కీలకమైన జీఎస్‌టీతోపాటు పలు బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి.

ఆమోదం పొందిన ముఖ్యమైన బిల్లులు
లోక్‌సభ: బోనస్ బిల్లు, దివాలా బిల్లు, మధ్యవర్తిత్వ-ఒప్పంద సవరణ బిల్లు, అణుశక్తి బిల్లు, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ బిల్లు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిల్లు, పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు
రాజ్యసభ: జువనైల్ జస్టిస్ బిల్లు, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ బిల్లు, కమర్షియల్ కోర్టులు-కమర్షియల్ డివిజన్ బిల్లు,మధ్యవర్తిత్వ-ఒప్పంద సవరణ బిల్లు, బోనస్ బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లు.

రాష్ట్రీయం 
మంగళగిరిలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన
గుంటూరు (ఏపీ) జిల్లాలోని మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)కు డిసెంబర్ 19న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శంకుస్థాపన చేశారు. రూ.1,618 కోట్ల వ్యయంతో రెండేళ్ల కాలంలో ఎయిమ్స్ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు.

సమ్మిళితవృద్ధికై మలేసియా సంస్థతో ఏపీ ఒప్పందం
సమ్మిళితవృద్ధి సాధనకై ఏపీ ప్రభుత్వం మలేసియాకి చెందిన పెమాండు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలో ఏపీ ప్రభుత్వం, పెమాండు (పెర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ డెలివరీ యూనిట్) సంస్థ ప్రతినిధుల మధ్య ఈ మేరకు డిసెంబర్ 15న ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు, సేవల పనితీరును మెరుగుపరచి సమ్మిళిత అభివృద్ధి సాధనకు కృషి చేయనున్నారు. అధికారిక కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికల అమలు, పర్యవేక్షణలలో రాష్ట్ర ప్రభుత్వంతో పెమాండు కలిసి పనిచేయనుంది.

నియామకాల్లో బీసీలకు క్రీమిలేయర్ వర్తింపు
తెలంగాణ రాష్ర్టంలో వెనకబడిన తరగతుల వారికి ఉద్యోగ నియామకాల్లో సంపన్న శ్రేణి (క్రీమి లేయర్) అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వును డిసెంబర్ 20న జారీ చేసింది. వార్షిక ఆదాయం రూ.6 లక్షలు దాటిన వారికి మాత్రమే క్రీమిలేయర్ వర్తిస్తుంది. ఇందులో వ్యవసాయ ఆదాయం, వేతనానికి మినహాయింపు ఉంది.

బాక్సైట్ సరఫరా జీఓను రద్దుచేసిన ఏపీ ప్రభుత్వం
Current Affirs బాక్సైట్ సరఫరా ఒప్పందానికి సంబంధించి 2008 ఆగస్టు 13న జారీ చేసిన జీఓ 222ను రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. అలాగే ఏపీఎండీసీ-అన్‌రాక్ 2008 అక్టోబర్ 30న కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. డిసెంబర్ 22న శాసనసభలో బాక్సైట్, ఇసుక విధానంపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. విశాఖ జిల్లాలో జెర్రెల నిక్షేపాల నుంచి 224 మిలియన్ టన్నుల బాక్సైట్‌ను సరఫరా చేసేందుకు 2007లో రాష్ట్ర ప్రభుత్వం రస్ అల్ ఖైమాతో ఎంఓయూ చేసుకుందని, రస్ అల్ ఖైమా, పెన్నా గ్రూపు కలిసి అన్‌రాక్ కంపెనీగా ఏర్పడిందన్నారు. ఇందులో 2009 నాటికి పెన్నా, రస్ అల్ ఖైమా మధ్య వాటా విధానం 70:30గా ఉందని, 2012-13 నాటికి ఆ వాటా విధానం 87:13గా మారిందని చంద్రబాబు వివరించారు.

ఆర్థికం 
67.09 వద్ద కనిష్ట స్థాయికి రూపాయి
డాలరుతో రూపాయి మారక విలువ డిసెంబర్ 14న కనిష్ట స్థాయిలో 67.09కి పడిపోయింది. ఇది గత 27 నెలల కనిష్ట స్థాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచనుండటంతో విదేశీ నిధులు భారీగా తరిలిపోతాయనే ఆందోళన ఫలితంగా రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోయింది. 2015 ప్రారంభం నుంచి రూపాయి విలువ క్షీణత 5.9 శాతంగా ఉంది.

రూ.50 వేలు మించిన నగదు చెల్లింపులకు పాన్ 
రూ.50,000 మించి జరిగే నగదు చెల్లింపులకు పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్)ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ డిసెంబర్ 15న ఈ మేరకు లోక్‌సభలో ప్రకటన చేశారు. హోటల్ బిల్లులు, విదేశీ ప్రయాణ టికెట్లకు సంబంధించి రూ.50,000 మించితే పాన్ తప్పనిసరి కాగా, విలాసవంతం కాని లావాదేవీలకు రూ.2 లక్షలు దాటితే పాన్ నంబరు తప్పనిసరి.

జీడీపీ వృద్ధి రేటు 7-7.5 శాతంప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7-7.5 శాతంగా ఉండొచ్చని తాజాగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇంతకు ముందు 8.1-8.5 శాతంగా ఉండొచ్చని లెక్కలు వేసినప్పటికీ ఆ స్థాయికి చేరుకోవడం కష్టమని పేర్కొంది. అయితే, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా వస్తాయనుకున్న నిధుల పరిమాణం తగ్గినా.. పన్నుల వసూళ్లు అధికంగా ఉండటం ద్వారా బడ్జెట్ లోటు కట్టడి లక్ష్యాన్ని సాధించగలమని తెలిపింది. డిసెంబర్ 18న పార్లమెంటులో ప్రవేశపెట్టిన అర్ధ సంవత్సర ఆర్థిక విశ్లేషణ నివేదికలో కేంద్ర ఆర్థిక శాఖ ఈ విషయాలు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును 3.9 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని సాధించగలమని పేర్కొంది.

తెలంగాణ రుణ ప్రణాళిక రూ.59,831 కోట్లుCurrent Affirs తెలంగాణకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్య రంగాలకు రూ.59,831 కోట్ల రుణం అవసరమని జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) అంచనా వేసింది. డిసెంబర్ 22న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర రుణ సదస్సులో రుణ ప్రణాళిక అంచనాలను నాబార్డు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఇది 20 శాతం ఎక్కువ. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.43,444.35 కోట్లు కేటాయించారు. వాటిలో పంట రుణాలకు రూ.30,435.09 కోట్లు, టర్మ్, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,009.26 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి వ్యాపార రుణాలకు రూ.8,464.58 కోట్లు, ఇతర ప్రాధాన్య రంగాలకు రూ.7,922.21 కోట్లని అంచనా వేశారు. రుణ ప్రణాళికను ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ విడుదల చేశారు. ప్రణాళిక వివరాలను నాబార్డు సీజీఎం వి.వి.వి.సత్యనారాయణ వెల్లడించారు.

సైన్స్‌ అండ్ టెక్నాలజీ 
పీఎస్‌ఎల్‌వీ-సీ29 ప్రయోగం విజయవంతం
భారత్ చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ (పీఎస్‌ఎల్‌వీ-సీ29) ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి డిసెంబర్ 16న ఆరు సింగపూర్ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ29 భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) షార్ నుంచి చేపట్టిన 50వ ప్రయోగం. ఆరు ఉపగ్రహాలలో రిమోట్ సెన్సింగ్ కోసం రూపొందించిన టెలియాస్-01 ఉపగ్రహం (బరువు 400 కిలోలు)తో పాటు కెంట్ రిడ్జ్ (78 కిలోలు), వెలాక్సి-సీ1 (123 కిలోలు), వెలాక్స్-2 (13 కిలోలు), గెలాషియో (3.4 కిలోలు), ఎథినోక్సాట్ అనే చిన్న ఉపగ్రహం ఉన్నాయి. ఇస్రో 1999 నుంచి వాణిజ్య పరంగా ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టటం ప్రారంభించింది.

భూమిపైకి తిరిగొచ్చిన ‘ఫాల్కన్9’ రాకెట్
Current Affirs అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే తొలిసారిగా నింగిలోకి దూసుకెళ్లిన ‘ఫాల్కన్ 9’ అనే రాకెట్ విజయవంతంగా భూమిపైకి వచ్చింది. కాలిఫోర్నియాకు చెందిన స్పేస్ ఎక్ప్‌ప్లొరేషన్ టెక్నాలజీస్ కంపెనీ(స్పేస్-ఎక్స్)అనే ప్రైవేట్ సంస్థ దీన్ని రూపొందించింది. ఎన్నో విఫలయత్నాల తర్వాత భూమిపై ఫాల్కన్ నేరుగా ల్యాండ్ అయినట్లు కంపెనీ తెలిపింది. రాకెట్ మొదటి దశ ఫ్లోరిడాలోని కేప్‌కెనవరల్ వద్ద డిసెంబర్ 21న నేలపై దిగినట్లు పేర్కొన్నారు. ఆర్బ్‌కాం కంపెనీకి చెందిన 11 కృత్రిమ ఉపగ్రహాలను ఫాల్కన్ భూ సమీప కక్ష్యలో ప్రవేశపెట్టింది. స్పేస్-ఎక్స్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అభినందించింది. కృత్రిమ ఉపగ్రహాలను (పేలోడ్) అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ప్రతిసారి కొన్ని వేల కోట్ల రూపాయలు వృథా అవుతున్నాయి. ఎంతో విలువైన రాకెట్ సామగ్రి కూడా నాశనం అవుతోంది. ఇప్పుడు స్పేస్-ఎక్స్ చేపట్టిన ప్రయోగంతో రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. అమెజాన్ కంపెనీకి చెందిన బ్లూ ఆరిజిన్ అనే రాకెట్ల తయారీ కంపెనీ 2015 నవంబర్‌లో ఈ తరహా ప్రయోగం విజయవంతంగా చేపట్టింది. అయితే ఈ ప్రయోగంలో నేరుగా భూమిపై ల్యాండ్ కాకుండా పారాచూట్ సహయంతో నేలపైకి వచ్చింది.

వార్తల్లో వ్యక్తులు సీబీడీటీ చైర్మన్‌గా ఏకే జైన్కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్‌గా సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి ఏకే జైన్ డిసెంబర్ 15న నియమితులయ్యారు. జైన్ 2016 జనవరి వరకు పదవిలో కొనసాగనున్నారు.

ప్రధాన సమాచార కమిషనర్‌గా ఆర్కే మాథుర్
ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా డిసెంబర్ 18న రక్షణ శాఖ మాజీ కార్యదర్శి ఆర్కే మాథుర్ నియమితులయ్యారు. త్రిపుర కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారైన మాథుర్ 65 ఏళ్ల వరకు పదవిలో కొనసాగనున్నారు.

నటుడు, రచయిత చాట్ల శ్రీరాములు మృతి
ప్రముఖ నటుడు, రచయిత చాట్ల శ్రీరాములు (84) హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన తొలిసారి 1976లో రంగస్థల నటజీవితం మొదలు పెట్టారు. 100కుపైగా నాటకాల్లో నటించటంతో పాటు దర్శకత్వం వహించారు. ఆంధ్ర నాటక కళాపరిషత్ నుంచి రెండు సార్లు ఉత్తమ నటుడి అవార్డుతో పాటు 1982లో సంగీత నాటక అకాడమీ పురస్కారం దక్కించుకున్నారు. 1970లో చాట్ల శ్రీరాములుకు లండన్‌లోని బ్రిటీష్ డ్రామా లీగ్ ప్రొడ్యూసర్ అండ్ టీచర్ పురస్కారం అందించింది. దీంతో పాటు ఆయన అనేక పుస్తకాలను రచించారు.

మదర్ థెరిసా దైవదూత
Current Affirs భారత రత్న, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసాను దైవదూత(సెయింట్)గా వాటికన్ సిటీ ధ్రువీకరించినట్లు మిషనరీస్ ఆఫ్ చారిటీ అధికార ప్రతినిధి సునీతా కుమార్ తెలిపారు. 2016 సెప్టెంబర్ 4న రోమ్‌లో ఆమెకు అధికారికంగా ఈ హోదా ఇవ్వనున్నట్లు క్యాథలిక్ పత్రిక అవెనైర్ ప్రకటించింది. మాసిడోనియాలో 1910లో జన్మించిన మదర్ కోల్‌కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి 45 ఏళ్లపాటు పేదలు, రోగులకు విశిష్టమైన సేవలందించారు. 1951లో భారత పౌరసత్వం స్వీకరించారు. 1979లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. 1997లో కోల్‌కతాలో తుదశ్వాస విడిచారు.

ప్రముఖ నటుడు రంగనాథ్ ఆత్మహత్య
Current Affirs ప్రముఖ తెలుగు సినీ నటుడు రంగనాథ్(66) డిసెంబర్ 19న హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. గాంధీనగర్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయారు. 1949లో చెన్నైలో జన్మించిన రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్. రైల్వేశాఖలో టికెట్ కలెక్టర్(టీసీ)గా పనిచేస్తూ సినిమాపై ఆసక్తితో చిత్రరంగంలోకి ప్రవేశించారు. బుద్ధిమంతుడు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 1974లో ‘చందన’ చిత్రంలో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. రంగనాథ్ సుమారు 300 చిత్రాలకుపైగా నటించారు. పలు టీవీ సీరియళ్లల్లోనూ కనిపించారు. ‘మొగుడ్స్-పెళ్లామ్స్’ సినిమాకు దర్శకత్వం వహించారు. 50 చిత్రాల్లో హీరోగా, మరో 50 చిత్రాల్లో ప్రతినాయకుడిగా, మరికొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాత్రలు పోషించి ప్రేక్షకుల ప్రశంశలు అందుకున్నారు.

‘నిర్భయ’ కేసులో బాల నేరస్తుడు విడుదల
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ దోషుల్లో ఒకరైన బాల నేరస్తుడు(ప్రస్తుతం 20 ఏళ్లు) డిసెంబర్ 20న బాల నేరస్తుల సంరక్షణ గృహం నుంచి విడుదలయ్యాడు. ఆ బాల నేరస్తుడిని సొంతప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని బదాయూ పంపించకుండా.. అతడి కోరిక మేరకు ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. అక్కడ అతడిపై ఎలాంటి పోలీసు పర్యవేక్షణ ఉండదు. గ్యాంగ్ రేప్ బాధితురాలు జ్యోతి సింగ్ తల్లిదండ్రులు, పలువురు సామాజిక కార్యకర్తలు ఈ ‘నిర్భయ’ దోషి విడుదలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బాల నేరస్తుడి పునరావాసం కోసం రూ. 10 వేలు, కుట్టుమిషన్ అందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.

సినీ రచయిత కాశీ విశ్వనాథ్ కన్నుమూత
తెలుగు చలన చిత్ర రంగానికి నిరుపమాన సేవలందించిన ప్రఖ్యాత రచయిత, నటుడు, రంగస్థల ప్రయోక్త శిలుకోటి కాశీ విశ్వనాథ్ (69) డిసెంబర్ 22న కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు రైల్లో వస్తుండగా ఖమ్మం సమీపంలో డిసెంబర్ 22వ తేదీ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందారు. 1946లో విశాఖలో శిలుకోటి అప్పలస్వామి, బుచ్చయమ్మ దంపతులకు జన్మించిన కాశీ విశ్వనాథ్.. హైస్కూల్ స్థాయి నుంచే రంగస్థల నటుడిగా, నాటక ర చయితగా, దర్శకుడిగా.. యూనివర్సిటీ స్థాయిలో జాతీయ క్రీడాకారుడిగా రాణించారు. 1980లో సినీ రంగప్రవేశం చేశారు. ‘రామాయణంలో పిడకల వేట’ చిత్రంతో రచయితగా పరిచయమయ్యారు. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మగమహారాజు’, ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్’, ‘ఎదురింటి మొగుడు-పక్కింటి పెళ్లాం’, ‘దొంగ కోళు’్ల, ‘ఖైదీ నం 786’ తదితర చిత్రాలతో రచయితగా తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. 124 చిత్రాలకు కథ, మాటలు అందించిన కాశీవిశ్వనాథ్.. 37 చిత్రాల్లో నటించారు.

పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్‌ను సస్పెండ్ చేసిన బీజేపీ
Current Affirs మాజీ క్రికెటర్, పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్‌ను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సస్పెండ్ చేసింది. ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం (డీడీసీఏ) అవకతవకలపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లక్ష్యంగా బహిరంగంగా ఆరోపణలు చేసి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు బీజేపీ డిసెంబర్ 23న ఒక ప్రకటనలో తెలిపింది. తక్షణమే సస్పెన్షన్ వర్తింస్తుందని పేర్కొంది. బిహార్‌లోని దర్భంగ స్థానం నుంచి లోక్‌సభకు ఆజాద్ 3 సార్లు ఎన్నికయ్యారు.

అవార్డులుకేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాలు
కేంద్ర సాహిత్య అకాడెమీ 2015 సంవత్సరానికి పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 23 భాషల్లోని రచనలు అవార్డులకు ఎంపికయ్యాయి. ఫిబ్రవరి 16న అవార్డులను అందజేయనున్నారు. తెలుగుకు సంబంధించి ప్రముఖ రచయిత్రి ఓల్గా రచించిన చిన్న కథల సంకలనం ‘విముక్త’కు కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది. ప్రొ. శ్రీకాంత్ బహుల్కర్‌కు భాషా సమ్మాన్ అవార్డు లభించింది. శాస్త్రీయ, మధ్యయుగ సాహిత్యంలో చేసిన కృషికి గానూ ఆయనకు ఈ అవార్డు దక్కింది.
అవార్డు విజేతల వివరాల కోసం క్లిక్ చేయండి

రాష్ట్రపతి ప్రణబ్‌కు గార్‌వుడ్ అవార్డ్
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాలిఫోర్నియాలోని ‘యూసీ బర్కేలే హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ నుంచి గార్‌వుడ్ అవార్డును అందుకున్నారు. ఓపెన్ ఇన్నోవేషన్(పరిశోధన ఫలితాల్లో రిస్కులను, రివార్డులను పంచుకోవడం ద్వారా సంస్థలు ఇతర సంస్థలతో కలిసి వినూత్న ఆవిష్కరణలకు నాంది పలకడం)లో విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించినందుకు గాను ఆయనకు ఈ ‘ఔట్‌స్టాండింగ్ గ్లోబల్ లీడర్’ అవార్డు లభించింది. గార్‌వుడ్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సోలోమన్ డార్విన్ డిసెంబర్ 17న రాష్ట్రపతి భవన్‌లో ఈ అవార్డును ప్రణబ్‌కు అందజేశారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన మూడేళ్ల కాలంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రణబ్ ముఖర్జీ అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. 2015 సంవత్సరం ప్రారంభంలో రాష్ట్రపతి భవన్‌లో తొలిసారిగా ‘ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

డాక్టర్ ఎం.రామయ్యకు నాయుడమ్మ అవార్డు
అమెరికాలోని కార్నెగిమెల్లాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.రామయ్య కృష్ణన్.. నాయుడమ్మ అవార్డు- 2015కు ఎంపికయ్యారు. నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్స్ సెంటర్ ఏటా ఈ అవార్డును అందజేస్తుంది. అవార్డుకు ఎంపికైన డాక్టర్ రామయ్య కృష్ణన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, ఆస్టిన్ నుంచి మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫ్‌ర్మేషన్ సిస్టమ్స్‌లో పీహెచ్‌డీ పొందారు. జనరల్ మోటార్స్ డిస్టెన్స్ టీచింగ్ ఎక్స్‌లెన్స్ అవార్డుతోపాటు 23 ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన అందుకున్నారు. అంతర్జాతీయ వైజ్ఞానిక పత్రికల్లో, 100కు పైగా వైజ్ఞానిక సదస్సుల్లో పరిశోధన పత్రాలను ప్రచురించారు. డిసెంబర్ 21వ తేదీన చెన్నైలోని ఐఐటీలో జరిగే 21వ నాయుడమ్మ స్మారకోత్సవంలో డాక్టర్ రామయ్య కృష్ణన్.. నాయుడమ్మ స్మారకోపన్యాసం చేస్తారు. ఐఐటీ డెరైక్టర్ డాక్టర్ భాస్కర్ రామమూర్తి ఆయనకు నాయుడమ్మ స్మారక అవార్డును ప్రదానం చేస్తారు.

ఈసీఐఎల్‌కు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అవార్డు
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అవార్డు-2015ను సొంతం చేసుకుంది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చేతుల మీదుగా ఈసీఐఎల్ దక్షిణ భారత జీఎం కుల్‌దీప్‌సింగ్ దలాల్, ఎంఆర్‌కే నాయుడు అవార్డును అందుకున్నారు. ఎప్పటికప్పుడు అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఎలక్ట్రానిక్స్ రంగంలో చేస్తున్న పరిశోధనలకు గాను ఈ అవార్డును అందజేశారు.

ఆండీ ముర్రేకు బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ అవార్డు{బిటన్ 79 ఏళ్ల తర్వాత డేవిస్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేకు 2015 సంవత్సరానికి బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ అవార్డు లభించింది. డిసెంబర్ 20న జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ప్రపంచ రెండో నంబర్ ఆటగాడు అవార్డు అందుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ముర్రే రెండోసారి గెలుచుకోవడం విశేషం. ఐదేళ్ల పాటు తాము ఓ ప్రణాళిక ప్రకారం కష్టపడటం వల్ల డేవిస్ కప్ గెలిచామని ఈ సందర్భంగా ముర్రే వ్యాఖ్యానించాడు.

సతీశ్‌రెడ్డికి ‘ఇంజనీరింగ్ ఎక్సలెన్స్’ అవార్డు Current Affirs
రక్షణ శాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారు, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డెరైక్టర్ సతీశ్‌రెడ్డిని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఇంజనీరింగ్ విభాగంలో అత్యున్నత ప్రతిభ చూపిన వారికి ది ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఐఈఐ,), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (ఐఈఈఈ) ఇచ్చే ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ అవార్డును ఆయన అందుకోనున్నారు. దేశ రక్షణ రంగ స్వావలంబనలో, జాతీయ భద్రతలో సతీశ్‌రెడ్డి పరిశోధనలు కీలకభూమిక పోషించాయని అవార్డుల న్యాయనిర్ణేతలు పేర్కొన్నారు. ఐఈఈఈ స్వర్ణోత్సవాల సందర్భంగా 2016లో జరిగే కార్యక్రమంలో అవార్డు అందజేస్తారు.

క్రీడలు
కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్
కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి భారత పురుషుల జట్టు స్వర్ణపతకం సాధించింది. మహిళల విభాగంలో సింగపూర్ స్వర్ణపతకం గెలుచుకోగా భారత మహిళల జట్టుకు రజతపతకం దక్కింది. మిక్సిడ్ డబుల్ విభాగంలో భారత్ స్వర్ణ, రజత పతకాలను సాధించింది. సూరత్‌లో డిసెంబర్ 21న ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం 15 పతకాలు గెలుచుకోగా అందులో 3 స్వర్ణ, 5 రజత, 7 కాంస్య పతకాలున్నాయి.

ఐఎస్‌ఎల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేతగా చెన్నైయిన్ జట్టుఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ రెండో సీజన్‌లో చెన్నైయిన్ జట్టు విజేతగా నిలిచింది. గోవాలో డిసెంబర్ 20న జరిగిన ఫైనల్లో గోవా ఫుట్‌బాల్ క్లబ్‌ను చెన్నైయిన్ జట్టు ఓడించింది.

సింగపూర్ ఓపెన్ విజేత అభయ్
భారత జూనియర్ స్క్వాష్ ఆటగాడు అభయ్ సింగ్ 2015వ సంవత్సరంలో రెండో అంతర్జాతీయ టోర్నీని గెలుపొందాడు. ఓల్డ్ చాంగ్ కీ సింగపూర్ స్క్వాష్ ఓపెన్‌లో డిసెంబర్ 20న జరిగిన అండర్-19 బాలుర సింగిల్స్ ఫైనల్లో అభయ్.. అల్విన్ చాయ్(మలేసియా)ను చిత్తుగా ఓడించాడు. దీంతో ఓవరాల్‌గా 2015లో ఏడో టైటిల్‌ను 17 ఏళ్ల అభయ్ తన ఖాతాలో వేసుకున్నాడు.

సుమీత్, మనూ జంటకు మెక్సికో ఓపెన్ టైటిల్హెదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రితో కలిసి మెక్సికో ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నీలో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మెక్సికో సిటీలో డిసెంబర్ 20న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్-మనూ అత్రి ద్వయం, బొదిన్ ఇసారా-నిపిత్‌ఫోన్ పువాంగ్‌పెచ్ (థాయ్‌లాండ్) జంటపై గెలిచింది. విజేతగా నిలిచిన సుమీత్ జోడీకి 3,950 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 61 వేలు)తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

బ్లాటర్, ప్లాటినిలపై ఎనిమిదేళ్ల నిషేధం
ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు సెప్ బ్లాటర్, ఉపాధ్యక్షుడు మైకేల్ ప్లాటినిలపై ఎనిమిదేళ్ల నిషేధం విధిస్తూ ఫిఫా ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కాలంలో వీరిద్దరు ఫుట్‌బాల్‌కు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొన రాదని ఆదేశించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది. అలాగే బ్లాటర్‌పై 50 వేల డాలర్లు, ప్లాటినిపై 80 వేల స్విస్ ఫ్రాంక్స్ జరిమానాగా విధించారు. దీంతో 79 ఏళ్ల ప్లాటిని కెరీర్ పూర్తిగా ముగిసినట్టే. 2011లో ప్లాటినికి 2 మిలియన్ల డాలర్లను బ్లాటర్ చెల్లించడం ఈ వివాదానికి మూల కారణం.

‘చాంపియన్స్’గా సానియా, హింగిస్ జోడి
Current Affirs సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడిని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల డబుల్స్ వరల్డ్ చాంపియన్‌గా ప్రకటించింది. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స్విట్జర్లాండ్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ కలిసి మహిళల డబుల్స్‌లో 2015లో అత్యద్భుత విజయాలు సాధించారు. హింగిస్‌కు గతం (2000)లో సింగిల్స్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన అనుభవముంది. 2015 మార్చిలో సానియా, హింగిస్ కలిసి డబుల్స్ ఆడడం ప్రారంభించి రెండు గ్రాండ్‌స్లామ్స్‌తో పాటు ఏడు ఇతర టైటిళ్లు సాధించారు. యూఎస్ ఓపెన్ నుంచి తమ చివరి 22 మ్యాచ్‌ల్లో వీరికి ఓటమనేది లేదు. ఈ క్రమంలో గ్వాంగ్జూ, వుహాన్, బీజింగ్, డబ్ల్యుటీఏ ఫైనల్స్ టైటిల్స్ సాధించారు. ఓవరాల్‌గా ఈ సీజన్‌ను 55-7తో ముగించారు. మరోవైపు పురుషుల, మహిళల సింగిల్స్ వరల్డ్ చాంపియన్స్‌గా జొకోవిచ్ ఐదోసారి, సెరెనా విలియమ్స్ ఆరోసారి ఎంపికయ్యారు.

2019లో ఏపీలో జాతీయ క్రీడలు
Current Affirs జాతీయ క్రీడలకు మరోసారి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2019లో జరిగే 37వ జాతీయ క్రీడలను ఏపీలో నిర్వహించడానికి జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అంగీకరించింది. గువాహటిలో డిసెంబర్ 23న జరిగిన ఐఓఏ సమావేశంలో ఈ మేరుకు నిర్ణయం తీసుకున్నారని శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి 2019లో జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్‌లో జరగాల్సి ఉంది. అయితే తాము ప్రస్తుతం ఆ క్రీడలను నిర్వహించే పరిస్థితిలో లేమని ఆ రాష్ట్రం ఇటీవల తెలిపింది. దీంతో తాజాగా ఐఓఏ సమావేశంలో బిడ్‌లను పిలిచారు.

ఐసీసీ వార్షిక అవార్డులు
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక అవార్డులను ప్రకటించింది. 2015 సంవత్సరానికి అత్యుత్తమ క్రికెటర్ (సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ) అవార్డును ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ గెలుచుకున్నాడు. అలాగే ‘ఉత్తమ టెస్టు క్రికెటర్’ పురస్కారం కూడా అతనికే దక్కింది. వన్డేల్లో ‘ఉత్తమ క్రికెటర్’ అవార్డును దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ వరుసగా రెండో ఏడాది కైవసం చేసుకున్నాడు. అంతకు ముందు 2010లో కూడా ఏబీకి ఈ అవార్డు దక్కింది. ఉత్తమ టి20 క్రికెటర్ పురస్కారం డు ప్లెసిస్‌కు లభించింది. అవార్డుల ఎంపిక కోసం ఐసీసీ 18 సెప్టెంబర్ 2014 నుంచి 13 సెప్టెంబర్ 2015 వరకు ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంది. ఇంగ్లండ్ అంపైర్ కెటిల్‌బొరో వరుసగా మూడో ఏడాది ఉత్తమ అంపైర్ అవార్డు గెలుచుకున్నారు.
అవార్డుల విజేతలు
  • అత్యుత్తమ క్రికెటర్ - స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
  • ఉత్తమ టెస్టు క్రికెటర్ - స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
  • ఉత్తమ వన్డే ఆటగాడు - ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)
  • ఉత్తమ మహిళా వన్డే క్రికెటర్ - మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా)
  • ఉత్తమ టి20 ఆటగాడు - డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా)
  • ఉత్తమ మహిళా టి20 క్రికెటర్ - స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్)
  • ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - జోష్ హాజెల్‌వుడ్ (ఆస్ట్రేలియా)
  • అసోసియేట్, అఫిలియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - కుర్రమ్ ఖాన్ (యూఏఈ)
  • స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు - బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్)
  • ఉత్తమ అంపైర్ - డేవిడ్ కెటిల్‌బొరో (ఇంగ్లండ్)

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates