Ticker posts

9/recent/ticker-posts

అంతర్జాతీయంఆసియాన్ సదస్సు
ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్-ఆసియాన్) సదస్సు సెప్టెంబర్ 6-8 తేదీల్లో లావోస్‌లోని వియంటైన్‌లో జరిగింది. ఈ సదస్సును ‘టర్నింగ్ విజన్ ఇన్‌టూ రియాలిటీ ఫర్ ఎ డైనమిక్ ఆసియాన్ కమ్యూనిటీ’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. సదస్సులో ఆసియాన్ కమ్యూనిటీ విజన్ 2025 అమలుపై ఆసియాన్ వెలుపలి భాగస్వాములతో సహకారాన్ని విస్తరించుకోవడంపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ‘వన్ ఆసియాన్, వన్ రెస్పాన్స్’ అనే ఆసియాన్ డిక్లరేషన్‌పై నేతలు సంతకాలు చేశారు. ఈ ప్రాంతంతోపాటు వెలుపలి ప్రాంతంలో సంభవించే విపత్తులపై ఆసియాన్ ఒకటిగా స్పందించాలని నిర్ణయించారు.
ఆసియాన్-భారత్ సదస్సు
ఆసియాన్ సదస్సులో భాగంగా సెప్టెంబర్ 8న 14వ ఆసియాన్-భారత్ సదస్సు జరిగింది. ఇందులో భారత ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విదేశీ ఉగ్రవాదం పెరిగిపోతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఆసియాన్ సభ్యదేశాలు సమన్వయంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

తూర్పు ఆసియా సదస్సు
తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 8న లావోస్‌లోని వియంటైన్‌లో జరిగింది. జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అణు భద్రతకు చర్యలు తీసుకోవాలని సదస్సు తీర్మానించింది. ఈ సందర్భంగా 18 దేశాలు అణు నిరాయుధీకరణ, అణు సాంకేతిక పరిజ్ఞాన వ్యాప్తి నిరోధానికి మద్దతు పలికాయి. ఈ సమావేశంలో 10 ఆసియాన్ దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యాలు పాల్గొన్నాయి.
2005లో తూర్పు ఆసియా శిఖరాగ్ర వేదిక ఏర్పాటు చేసిన నాటి నుంచి భారత్ అందులో సభ్యురాలిగా ఉంది.

Current Affairsనిరాశ్రయులుగా 5 కోట్ల మంది చిన్నారులు

యుద్ధం, హింస, అంతర్గత తిరుగుబాట్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మంది చిన్నారులు నిరాశ్రయులయ్యారని యూనిసెఫ్ వెల్లడించింది. యునిసెఫ్ అంచనా ప్రకారం వివిధ దేశాల్లో చెలరేగుతున్న హింస కారణంగా 2.8 కోట్ల చిన్నారులు నిరాశ్రయులవగా దాదాపు 1.7 కోట్ల మంది స్వదేశంలోనే నిరాదరణకు గురవుతున్నారు. అంతర్గత యుద్ధాలు, పేదరికం కారణంగా 2 కోట్ల మంది చిన్నారులు ఇళ్లు వదిలి వెళ్తున్నారు. 2015లో యునిసెఫ్ చేరదీసిన పిల్లల్లో 45 శాతం మంది సిరియా, అఫ్గానిస్తాన్ల నుంచే ఉన్నారు.

పారిస్ ఒప్పందాన్ని ఆమోదించిన అమెరికా, చైనా 
పారిస్ వాతావరణ మార్పు ఒప్పందానికి అమెరికా, చైనాలు అమోదం తెలిపాయి. దీనికి సంబంధించిన ఆమోద పత్రాలను సెప్టెంబర్ 3న చైనాలోని హాంగ్జౌలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్‌కు అందించాయి. పారిస్ ఒప్పందం ఈ ఏడాది చివరి నాటికి అమల్లోకి రావాల్సి ఉంది. దీని కోసం ఒప్పందానికి అంగీకరించిన 195 దేశాల్లో కనీసం 55 దేశాలు ఆమోదించాల్సి ఉంటుంది.

Current Affairsఎత్తయిన వంతెనతో చైనా రికార్డు
ప్రపంచాన్ని అబ్బురపరిచే నిర్మాణాలు చేపట్టే చైనా తాజాగా ప్రపంచంలోనే అతి ఎత్తయిన వంతెనను నిర్మించింది. చైనాలోని బీపాంజియాంగ్‌లో సిడూ నదిపై నిర్మించిన ఈ వంతెన సెప్టెంబర్ 10న పూర్తయింది. దీని ఎత్తు 565 మీటర్లు, పొడవు 1,341 మీటర్లు. ఇప్పటి వరకు ఎత్తయిన వంతెన రికార్డు ఫ్రాన్స్ లోని మిలౌ వడయాక్ట్ (343 మీటర్లు) పేరిట ఉంది.

జాతీయం

కేంద్రం, నాబార్డ్, ఎన్‌డబ్ల్యూడీఏ మధ్య కీలక ఒప్పందం
సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధులకు సంబంధించి సెప్టెంబర్ 6న కేంద్ర జల వనరుల శాఖ, జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్), జాతీయ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై)లో భాగంగా నాబార్డ్ నిధులతో దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 (గుర్తించిన) సాగునీటి ప్రాజెక్టులను 2019-20 లోపు పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కొత్తగా 76.03 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియ తదితరులు పాల్గొన్నారు.

తమిళనాడుకు కావేరి జలాలు విడుదల

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 6న కర్నాటక ప్రభుత్వం తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేసింది. కృష్ణరాజసాగర్ రిజర్వాయర్ (కేఆర్‌ఎస్), హారంగి, కబిని, హేమావతి డ్యామ్‌ల నుంచి రోజుకు 12,000 క్యూసెక్కుల చొప్పున పది రోజులపాటు కావేరీ జలాలను విడుదల చేస్తోంది.

గ్రామీణ పారిశుధ్యంలో అగ్ర భాగాన సిక్కిం గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులపై నిర్వహించిన జాతీయ శాంపిల్ సర్వే లో స్వచ్ఛ రాష్ట్రంగా సిక్కిం మొదటి స్థానాన్ని దక్కించుకుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ న్యూఢిల్లీలో సెప్టెంబర్ 8నఎన్‌ఎస్‌ఎస్‌వోసర్వే నివేదికను విడుదల చేశారు. ఇందులో 98.2 శాతంతో సిక్కిం మొదటి స్థానాన్ని దక్కించుకోగా, జార్ఖండ్ చివరి స్థానంలో నిలిచింది. గుజరాత్ 14వ స్థానంలో, ఏపీ 16వ, స్థానంలో, తెలంగాణ 22వ స్థానంలో నిలిచాయి. 2015 మే-జూన్ మధ్య 26 రాష్ట్రాల్లోని 3,788 గ్రామాలు, 73,716 నివాసాల్లో సర్వే నిర్వహించారు. మరుగుదొడ్లను కలిగి ఉన్న ఇండ్ల శాతం, వాటి వినియోగం ఆధారంగా  ఈ ర్యాంకులను ఖరారు చేశారు. కేంద్ర తాగునీరు, పారిశుధ్య మంత్రిత్వ శాఖ పారిశుధ్య పరిస్థితిపై సేకరించిన వివరాలతో క్రోడీకరించిన నివేదికలోనూ సిక్కిం (99.1 శాతం) అగ్రస్థానంలో నిలవగా, బిహార్ చివరి స్థానంలో ఉంది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లలో మరుగుదొడ్లు కలిగి వాడుతున్న వారి శాతం 42.13గా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ.. నివేదికలో పేర్కొంది.

యూపీఏ హయాంలో ‘ఎంబ్రాయర్’ కుంభకోణం

యూపీఏ హయాంలో 2008లో బ్రెజిల్ సంస్థ ఎంబ్రాయర్, డీఆర్డీవో మధ్య మూడు విమానాల కొనుగోలుకు కుదిరిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయని అమెరికా  న్యాయశాఖ వెల్లడించింది. మొత్తం రూ. 14 వేల కోట్ల (208 మిలియన్ డాలర్లు)తో కుదిరిన ఈ ఒప్పందంలో ఎంబ్రాయర్ సంస్థ ప్రభుత్వ అధికారులకు ముడుపులు ఇచ్చినట్లు తమ దగ్గర అధారాలున్నాయని తెలిపింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 8 దేశాల్లో కాంట్రాక్టులు పొందేందుకు కూడా ఆయా ప్రభుత్వాలకు ఎంబ్రాయర్ ముడుపులు ఇచ్చినట్లు తెలిపింది. యూపీఏ పాలనలో అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో కూడా అక్రమాలు జరగడంతో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది.

Current Affairsఆవాజ్-ఏ-పంజాబ్ పార్టీని ప్రకటించిన సిద్ధూ

ఇటీవల రాజ్యసభకు రాజీనామా చేసి బీజేపీ నుంచి బయటకు వచ్చిన మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ ఆవాజ్-ఏ-పంజాబ్ పేరుతో రాజకీయేతర పార్టీని ప్రకటించారు. చండీగఢ్‌లో సెప్టెంబర్ 8న కొత్త పార్టీని ప్రకటించిన సిద్ధూ 15-20 రోజుల్లో తన పార్టీ భవిష్యత్ ప్రణాళికను ప్రకటించనున్నారు.

తొలి ద్వీప ప్రాంత జిల్లాగా మజులీ 
దేశంలో తొలి ద్వీప ప్రాంత జిల్లాగా అసోంలోని మజులీ ఏర్పడింది. ఈ మేరకు అసోం సీఎం సర్బానంద సోనోవాల్ సెప్టెంబర్ 8న ప్రకటన చేశారు. బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న మజులీ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం. దీని విస్తీర్ణం 1250 చ.కి.మీ. మజులీ అసోంలో 35వ జిల్లా.

కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి జల వివాదం
కావేరి నదీ జలాల పంపిణీపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరి హింసాత్మకంగా మారింది. దీంతో రెండు రాష్ట్రాల్లోను పౌరులు, ఆస్తులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఈ దాడుల్లో బెంగళూరులో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
తమిళనాడుకు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున 10 రోజుల పాటు కావేరి జలాలు విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు సెప్టెంబర్ 12న ఆదేశాలిచ్చింది. దీంతో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగి హింసాత్మకంగా మారడంతో వందల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

కశ్మీర్‌లో ఆపరేషన్ ‘కామ్ డౌన్’

హింస, ఉగ్రవాదంతో కల్లోలంగా మారిన కశ్మీర్‌ను కుదుట పరచడానికి భారత సైన్యం ఆపరేషన్ ‘కామ్ డౌన్’ను ప్రారంభించింది. ఈ మేరకు ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను ఏరివేసి సాధారణ పరిస్థితులు కల్పించడానికి దక్షిణ కశ్మీర్‌లో 4,000 అదనపు జవాన్లను మొహరించారు. అలర్ల నేపథ్యంలో 200 ఏళ్ల తరువాత జమా మసీద్ మూతపడింది. 1821 తరువాత ఇక్కడ బక్రీద్ ప్రార్థనలు జరగకపోవడం ఇదే తొలిసారి.

ఆర్థికం

Current Affairsఈ ఏడాది వృద్ధి రేటు 7.5%: డీ అండ్ బీభారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.5 శాతంగా ఉండనుందని (గత ఆర్థిక సంవత్సరం 7.2 శాతం)  ప్రపంచ వాణిజ్య, వ్యాపార సమాచార విశ్లేషణా సంస్థ డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీ అండ్ బీ) అంచనా వేసింది. వినియోగ  డిమాండ్ దీనికి ప్రధాన కారణమని, తగిన వర్షపాతంతో వ్యవసాయ వృద్ధి, దిగువస్థాయి క్రూడ్ ఆయిల్ ధరలు 7.5 శాతం వృద్ధికి బాటలు వేస్తాయని డీ అండ్ బీ ఇండియా ఆర్థికవేత్త అరుణ్‌సింగ్ తెలిపారు.

జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న వస్తు, సేవల పన్ను బిల్లు(జీఎస్టీ) రాజ్యాంగ సవరణ(122)కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. రాజ్యాంగ సవరణ బిల్లుకు కనీసం 50 శాతం రాష్ట్రాల మద్దతు అవసరం. కేంద్రం ఈ బిల్లు అమోదం కోసం 17 రాష్ట్రాలకు పంపగా 16 రాష్ట్రాలు అమోదించాయి. బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రంగా అస్సాం నిలవగా, ఒడిశా 16వ రాష్ట్రంగా నిలిచింది. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, సేవల పన్ను, కేంద్ర అమ్మకం పన్ను, అదనపు కస్టమ్స్ సుంకం వంటి వివిధ పన్నులను కలిపి ఒకే పన్నుగా చేయడమే వస్తు, సేవల పన్ను ఉద్దేశం.

సాఫ్ట్‌వేర్ రోబోటిక్స్ ప్రారంభించిన ఐసీఐసీఐ
ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ ‘సాఫ్ట్‌వేర్ రోబోటిక్స్’ లేదా ‘రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్’ను సెప్టెంబర్ 8న ముంబైలో ప్రారంభించింది. 2017 మార్చి నాటికి బ్యాంకింగ్ లావాదేవీల్లో 20 శాతం ఆటోమేషన్ ద్వారా జరగాలన్నదే తమ లక్ష్యమని బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ తెలిపారు.

జీఎస్‌టీ మండలికి కేబినెట్ ఆమోదం
వస్తు, సేవల పన్నుకు సంబంధించిన జీఎస్‌టీ మండలి ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 12న ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 22, 23 తేదీల్లో ఆర్థిక మంత్రి అధ్యక్షతన జరిగే తొలి  భేటీలో  ఆర్థిక శాఖ సహాయమంత్రి, కేంద్ర రెవెన్యూ విభాగం ఇన్‌చార్జ్, రాష్ట్రాల ఆర్థికమంత్రులు పాల్గొని పన్ను రేటు, ఇతర ముఖ్య అంశాలపై చర్చిస్తారు. నవంబర్ 22 లోగా పన్ను రేటు, మినహాయింపు వస్తువులు, అమలు తేదీని జీఎస్‌టీ మండలి నిర్ణయిస్తుంది.  కేంద్ర రెవెన్యూ కార్యదర్శి ఈ మండలిలో ఎక్స్-అఫిషియో సభ్యుడిగా కొనసాగుతారు కానీ ఓటు హక్కు ఉండదు.

సైన్స్ అండ్ టెక్నాలజీ
Current Affairsఇన్‌శాట్-3డీఆర్ ప్రయోగం విజయవంతం
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి సెప్టెంబర్ 8న వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్-3డీఆర్‌ను ఇస్రో విజయవంతంగా పయోగించింది. దీని కోసం దేశీయంగా రూపొందించిన సంక్లిష్ట క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ అమర్చిన భారీ రాకెట్ జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్05 ను ఉపయోగించారు. ఇది ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ఇన్‌శాట్-3డీఆర్ పనిచేయని ఇన్‌శాట్-3డీ స్థానంలో వాతావరణ, గాలింపు, సహాయ చర్యల్లో సాయపడనుంది. ఈ ఉపగ్రహంలో 6-చానల్ ఇమేజర్, 9-చానల్ సౌండర్ పరికరాలు, వాతావరణ సమాచార (డాటా) రిలే ట్రాన్స్‌పాండర్స్ (డీఆర్‌టీ), శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్‌ఏఎస్ అండ్ ఆర్) పరికరాలను అమర్చారు.

ఉపగ్రహ విశేషాలు
రాకెట్: జీఎస్‌ఎల్‌వీ ఎఫ్05
తీసుకెళ్లగల సామర్థ్యం: 415.2 టన్నులు
ఎత్తు: 49.1 మీటర్లు
వ్యాసం- 3.4 మీటర్లు
ఉపగ్రహం: ఇన్‌శాట్ 3డీఆర్
బరువు: 2,211 కిలోలు
జీవిత కాలం: 10 సంవత్సరాలు
కొలతలు: 2.4 x 1.6 x 1.5 (మీటర్లు)
విద్యుత్తు: 1700 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయగల రెండు సౌరఫలకాలు, 90 ఏహెచ్
లిథియం-అయాన్ బ్యాటరీ
ప్రయోగ వ్యయం: రూ. 210 కోట్లు
రాకెట్‌కు ఖర్చు: రూ. 160 కోట్లు
ఉపగ్రహం వ్యయం: రూ. 50 కోట్లు

అణుబాంబును పరీక్షించిన ఉత్తర కొరియా
కొత్తగా అభివృద్ధి చేసిన అణ్వాయుధం(వార్‌హెడ్)తో అణు బాంబును శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారని ఉత్తర కొరియా ప్రభుత్వ టీవీ చానల్ సెప్టెంబర్ 8న వెల్లడించింది. దీంతో రాకెట్‌కు చిన్న అణు వార్‌హెడ్‌ను అనుసంధానించే సామర్థ్యాన్ని కొరియా సంపాదించుకుంది. ఇది ఉత్తర కొరియా ఐదో అణు పరీక్ష. ఈ పరీక్షతో పుంగ్యెరి అణు కేంద్రం సమీపంలో రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో కృత్రిమ భూకంపం సంభవించింది. దీంతో ఉత్తర కొరియాపై ఆర్థికపరమైన ఆంక్షలతో దానిని ఒంటరిని చేయాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి.

క్రీడలు
రియో పారాలింపిక్స్ ప్రారంభం
2016 పారాలింపిక్స్ క్రీడలు సెప్టెంబర్ 8న రియో డి జనీరోలోని మరకానా స్టేడియంలో ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 18 వరకు జరగనున్న ఈ క్రీడల చరిత్రలో తొలిసారిగా 159 దేశాల నుంచి 4,342 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. భారత్ నుంచి 17 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. డోపింగ్ ఆరోపణలతో రష్యా అథ్లెట్లను క్రీడల్లో పాల్గొనకుండా బహిష్కరించారు.

Current Affairsపారాలింపిక్స్‌లో మరియప్పన్ తంగవేలుకు స్వర్ణంపారాలింపిక్స్‌లో సెప్టెంబర్ 11న జరిగిన పురుషుల హైజంప్ టి-42 లో తమిళనాడుకు చెందిన మరియప్పన్ తంగవేలు స్వర్ణ పతకం సాధించాడు. దీంతో ఒలిపింక్స్‌లో భారత్ నుంచి హైజంప్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన మొదటి అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. ఇదే విభాగంలో నోయిడాకు చెందిన వరుణ్ సింగ్ భటి కాంస్యం సాధించాడు. తంగవేలు 1.89 మీ. ఎత్తుకు ఎగిరి అగ్రస్థానంలో నిలవగా భటి 1.86 మీ.తో మూడో స్థానంలో నిలిచాడు. అమెరికాకు చెందిన సామ్ గ్రెవే (1.86) రెండో స్థానంతో రజతం అందుకున్నాడు. ఇటీవల ట్యునీషియాలో జరిగిన ఐపీసీ గ్రాండ్ ప్రి ఈవెంట్‌లో తంగవేలు 1.78మీ. జంప్‌తో స్వర్ణం అందుకున్నాడు.

Current Affairsపారాలింపిక్స్‌లో దీపా మలిక్‌కు రజతం
పారాలింపిక్స్‌లో మహిళల షాట్‌పుట్ (ఎఫ్-53) ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి, 46 ఏళ్ల దీపా మలిక్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 12న జరిగిన ఫైనల్లో దీపా ఇనుప గుండును 4.61 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది. ఫాతిమా నెధమ్ (బహ్రెయిన్-4.76 మీటర్లు) స్వర్ణం సాధించగా... దిమిత్రా కొరోకిడా (గ్రీస్-4.28 మీటర్లు) కాంస్యం సంపాదించింది.
దీపా మలిక్ 2011 ప్రపంచ చాంపియన్‌షిప్ షాట్‌పుట్‌లో రజత పతకం, 2010 ఆసియా పారాగేమ్స్‌లో జావెలిన్ త్రోలో కాంస్యం సాధించింది. 2012లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున’ అందుకొని ఈ అవార్డు పొందిన పెద్ద వయస్కురాలిగా (42 ఏళ్ల వయసులో) గుర్తింపు పొందింది.

వావ్‌రింకా, కెర్బర్‌కు యూఎస్ ఓపెన్ టైటిల్స్
యూఎస్ ఓపెన్ 2016 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్‌కు చెందిన స్టానిస్లాస్ వావ్‌రింకా తొలిసారిగా గెలుచుకున్నాడు. సెప్టెంబర్ 12న జరిగిన ఫైనల్లో మూడో సీడ్ వావ్రింకా 6 టాప్ సీడ్ జొకోవిచ్‌ను ఓడించాడు. వావ్రింకాకిది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2015లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలిచాడు.

మహిళల సింగిల్స్ టైటిల్‌ను జర్మనీకి చెందిన 28 ఏళ్ల ఎంజెలిక్ కెర్బర్ తొలిసారిగా సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 11న జరిగిన ఫైనల్లో రెండో సీడ్ కెర్బర్ పదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. కెర్బర్ 2016 సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించగా, వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచింది.

పురుషుల డబుల్స్ టైటిల్‌ను జమీ ముర్రే (గ్రేట్ బ్రిటన్), బ్రూనో సోరెస్ (బ్రెజిల్); మహిళల డబుల్స్ టైటిల్‌ను బెథాన్ మాటెక్ (అమెరికా), లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్);  మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను లారా సీజ్ మండ్ (జర్మనీ), మేట్ పావిచ్(క్రొయేషియా) దక్కించుకున్నారు.

ఇండియన్ రైల్వేస్‌కు మురుగప్ప గోల్డ్ కప్ హాకీ టైటిల్
90వ ఆల్ ఇండియా ఎంసీసీసీ-మురుగప్ప గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను సెప్టెంబర్ 11 ఇండియన్ రైల్వేస్ గెలుచుకుంది.

6 రెడ్ చాంపియన్‌షిప్‌లో అద్వానీకి కాంస్యం
భారత్‌కు చెందిన పంకజ్ అద్వానీ ప్రతిష్టాత్మక 6 రెడ్ స్నూకర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకున్నాడు.

డ్యూరాండ్ కప్ విజేత ఆర్మీ గ్రీన్ఆసియాలో అతి పురాతన ఫుట్‌బాల్ టోర్నమెంట్ అయిన డ్యూరాండ్ కప్‌లో ఆర్మీ గ్రీన్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. సెప్టెంబర్ 11న జరిగిన ఫైనల్లో ఆర్మీ గ్రీన్ ‘పెనాల్టీ షూటౌట్’లో 6-5తో నెరోకా ఫుట్‌బాల్ క్లబ్‌పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన ఆర్మీ గ్రీన్ జట్టుకు రూ. 45 లక్షలు... రన్నరప్ నెరోకా జట్టుకు రూ. 20 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.
1888లో మొదలైన డ్యూరాండ్ కప్‌లో మోహన్ బగాన్ క్లబ్, ఈస్ట్ బెంగాల్ క్లబ్ 16 సార్లు చొప్పున విజేతలుగా నిలిచాయి. హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టు నాలుగుసార్లు ఈ టోర్నీ టైటిల్‌ను సాధించింది. 

వార్తల్లో వ్యక్తులు
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ తొలగింపుఅరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జ్యోతి ప్రసాద్ రాజ్‌ఖోవాను కేంద్రం సెప్టెంబర్ 12న పదవి నుంచి తొలగించింది.కేంద్రం రాజ్‌ఖోవాను ఆరోగ్య  కారణాల రీత్యా రాజీనామా చేయాల్సిందిగా కోరింది. అయితే ఇందుకు నిరాకరించిన ఆయనను తొలగిస్తూ రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. కొత్త గవర్నర్‌ను నియమించేంతవరకు అరుణాచల్ గవర్నర్ బాధ్యతలను మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథన్‌కు అప్పగించారు.

Current Affairsపదమ్‌సీ చిత్రానికి రూ.19 కోట్లు
భారతీయ చిత్రకారుడు అక్బర్ పదమ్‌సీ గీచిన చిత్రానికి శాఫ్రాన్ ఆర్ట్స్ సంస్థ నిర్వహించిన వేలంలో రూ.19 కోట్ల రికార్డు ధర పలికింది. ‘గ్రీక్ ల్యాండ్ స్కేప్’ పేరిట 1960లో పదమ్‌సీ గీచిన ఈ చిత్రం భారీ ధరతో రికార్డు సృష్టించింది.‘‘2011లో సోత్‌బై సంస్థ వేలంలో రూ.9.3 కోట్లకు అమ్ముడుపోయిన ‘రీక్లైనింగ్ న్యూడ్’ చిత్రమే ఇప్పటివరకూ ప్రపంచ రికార్డు.

Current Affairsఫార్చ్యూన్ శక్తివంతమైన మహిళగా మేరీ బర్రా
ఫార్చ్యూన్ తాజాగా రూపొందించిన ‘ప్రపంచపు 51 అతి శక్తివంతమైన మహిళల’ జాబితాలో జనరల్ మోటార్స్ సీఈవో, చైర్మన్ మేరీ బర్రా అగ్రస్థానంలో నిలిచారు. పెప్సికో సీఈవో చైర్మన్ ఇంద్రా నూయి రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి స్థానం పొందిన ఒకే ఒక మహిళ ఇంద్రా నూయి. ఈమె 2015లో కూడా రెండవ స్థానంలోనే ఉన్నారు.

తర్వాతి స్థానాల్లో లాక్‌హీడ్ మార్టిన్ సీఈవో మెరిల్లిన్ హ్యూసన్(3వ స్థానం), ఐబీఎం సీఈవో గిన్ని రొమెట్టీ (4), ఫెడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ సీఈవో అబిగెయిల్ (5), ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ (6), హ్యూలెట్ పకార్డ్ ఎంటర్‌ప్రైస్ సీఈవో మెగ్ విత్‌మన్ (7), జనరల్ డైనమిక్స్ సీఈవో ఫెబె నొవాకొవిక్ (8), మాండలిజ్ ఇంటర్నేషనల్ సీఈవో ఐరెన్ రోసెన్‌ఫీల్డ్ (9), ఒరాకిల్ కో-సీఈవో సఫ్రా కాట్జ్ (10వ స్థానం) ఉన్నారు.

మిస్ దివా 2016 గా రోష్మిత
‘మిస్ దివా యూనివర్స్ ఇండియా-2016’ విజేతగా బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల రోష్మిత హరిమూర్తి నిలిచింది. తద్వారా 2017లో జరిగే మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో భారత్ తరఫున పొల్గొంటుంది. సెప్టెంబర్ 11న ముంబైలో జరిగిన ఈ పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా శ్రీనిధి శెట్టి సెకండ్ రన్నరప్‌గా ఆరాధన నిలిచారు. అలాగే యమహా ఫ్యాసినో మిస్ దివా సూపర్‌నేషనల్ 2016ను మొదటి రన్నరప్ శ్రీనిధి గెల్చుకుంది.

‘టైమ్‌స్క్వేర్’ ఫోటో నర్సు మృతి
ఫొటోగ్రఫీలో విశిష్టమైన ‘న్యూయార్క్ టైమ్‌స్క్వేర్ ఫొటో’ లోని నర్సు గ్రెటా ఫ్రైడ్‌మన్(92) మరణించారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై గెలిచిన ఆనందంలో రోడ్డుపై వెళ్తున్న గ్రెటాను, అమెరికా సైనికుడు కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్నాడు. ఈ దృశ్యాన్ని ఫొటోగ్రాఫర్ ఐసెన్‌స్టాడ్ట్ తీశాడు. 1980లో ఫొటోలోని వ్యక్తి ఆస్ట్రియాలో జన్మించిన ఫ్రైడ్‌మన్ అని గుర్తించారు.

యంగ్ ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్ గా భారత సంతతి వ్యక్తులు

భారత సంతతికి చెందిన నలుగురు పారిశ్రామికవేత్తలకు ఈ ఏడాదికిగాను ‘యంగ్ ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం దక్కింది. భారత్-అమెరికాల మధ్య బంధాలను బలోపేతం చేయడంలో తమవంతు పాత్ర పోషించినందుకు, పారిశ్రామిక రంగంలో విశేష ప్రతిభ కనబర్చినందుకు మలిషా పటేల్, రేవతి పింకు, భావేశ్ పటేల్, అబ్జార్ ఎస్ తయాబ్‌జీలకు ఈ పురస్కారం దక్కింది. వీరితో పాటు మార్విన్ ఓడమ్, రిచర్డ్ హబ్నర్, డాక్టర్ జాన్ మెండెల్సన్‌లకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం దక్కింది.

Current Affairsఫార్చ్యూన్ శక్తివంతమైన మహిళలు.. భట్టాచార్య, కొచర్, శిఖా శర్మ
ఫార్చ్యూన్ తాజాగా రూపొందించిన ‘అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల’ జాబితాలో అరుంధతీ భట్టాచార్య, చందా కొచర్, శిఖా శర్మ స్థానం పొందారు. ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోగా, ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ చందా కొచర్ 5వ స్థానంలో నిలిచారు. యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ 19వ స్థానంలో ఉన్నారు. మార్కెట్ విలువ పరంగా యూరోజోన్‌లోనే అతిపెద్ద బ్యాంక్ అయిన బ్యాంకో శాన్‌టండర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అన బాటిన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.

అవార్డులు
ముంబై రచయిత్రికి ఎఫ్‌ఓఎన్ పురస్కారం

కుమొన్ లిటరరీ ఫెస్టివల్ ‘ఎఫ్‌ఓఎన్ (ఫెలోస్ ఆఫ్ నేచర్) సౌత్ ఏషియా స్టోరీ’ పురస్కారానికి ముంబై రచయిత్రి మేఘనా పంత్ ఎంపికయ్యారు. ‘పీపుల్ ఆఫ్ ది సన్’ అనే కథకు గాను మేఘనకు ఈ గౌరవం దక్కింది. ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో కుమొన్ లిటరరీ ఫెస్టివల్ నిర్వాహకులు ఈ అవార్డును అందచేస్తున్నారు. ప్రకృతి సంబంధిత అంశాల్లో సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ పురస్కారం కింద గ్రహీతకు రూ.లక్ష నగదు అందజేస్తారు.

Current Affairsవిశాఖ ఉక్కుకు సీఐవో-100 అవార్డు
సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ)లో చూపిన ప్రతిభకు గాను విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సీఐవో-100 అవార్డు వరించింది. ప్రపంచంలో అతి  పెద్ద టెక్నాలజీ మీడియా, ఈవెంట్స్, రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డాటా గ్రూప్ (ఐడీజీ) ఐటీలో ప్రతిభ చూపిన ప్రపంచంలోని వంద సంస్థలకు ఈ అవార్డును ఇస్తుంది. సీఐవో మ్యాగజీన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11న పుణేలో జరిగిన పదకొండో వార్షిక సీఐవో సింపోజియం కార్యక్రమంలో అవార్డును అందచేశారు.

రాష్ట్రీయం
మాజీ మంత్రి మాణిక్‌రావు కన్నుమూత

తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మల్కోడ్ మాణిక్‌రావు (86) సెప్టెంబర్ 8న చికిత్స పొందుతూ మరణించారు. రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ఆయన... పీవీ నర్సింహారావు, జలగం వెంగళరావు, చెన్నారెడ్డి హయాంలో దాదాపు 14 ఏళ్ల పాటు వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు.
మాణిక్‌రావు 1964లో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1969 ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచి.. పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1972లో రెండోసారి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికై జలగం వెంగళరావు సర్కారులో వాణిజ్య, సమాచార శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.1978లో మూడోసారి శాసనసభకు ఎన్నికై .. చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆర్‌అండ్‌బీ, వాణిజ్య శాఖల మంత్రిగా పనిచేశారు. 1983లో నాలుగోసారి విజయం సాధించారు. అయితే 1994లో స్వతంత్ర అభ్యర్థిగా, 1999లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసినా పరాజయం పాలయ్యారు.

తెలంగాణ పౌరసరఫరాల శాఖకు ‘స్కోచ్’ అవార్డులుఅత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని తెలంగాణ పౌర సరఫరాల శాఖ అమలు చేస్తున్న ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డులకు ఎంపికయ్యాయి. సరుకులు దారి మళ్లకుండా చూసేందుకు, రైతులకు మద్దతు ధర అందించేందుకు  ఈ శాఖ అమలు చేస్తున్న ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్), ఈ-పీడీఎస్, ఎస్‌సీఎం (సప్లై చైన్ మేనేజ్‌మెంట్), ఓపీఎంఎస్ (ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ సిస్టం), ఫిర్యాదుల పరిష్కారం వంటి ఐదు ప్రాజెక్టులు ఈ అవార్డులకు ఎంపికయ్యాయి.
అలాగే ఆసరా పింఛన్ పథకంలో బయోమెట్రిక్ నిర్ధారణ కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అమలు చేస్తున్న లైవ్ ఎవిడెన్స్ ప్రక్రియ, వ్యవసాయ పనిముట్లను ఆన్‌లైన్ ద్వారా రైతులకు విక్రయించే పద్ధతికి శ్రీకారం చుట్టిన రాష్ర్ట వ్యవసాయ శాఖకు, ఆన్‌లైన్‌లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించేందుకు వీలు కల్పిస్తూ ప్రవేశపెట్టిన ‘ఈ స్టాంప్స్’ ప్రాజెక్టుకు కూడా ‘స్కోచ్’ అవార్డులు దక్కాయి.

Current Affairsతెలంగాణ పోలీసులకు 6 స్కోచ్ అవార్డులు

తెలంగాణ రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆరు ఐటీ సంబంధిత కార్యక్రమాలకు జాతీయ స్థాయి స్కోచ్ అవార్డులు లభించాయి. హ్యాక్ ఐ, హైదరాబాద్ కాప్స్, సీసీటీఎన్‌ఎస్, వెరీఫాస్ట్, ఈ-చలాన్, భరోసా కార్యక్రమాలకు ఈ అవార్డులు లభించాయి. అలాగే తెలంగాణ జెన్‌కో పాలన వ్యవహారాల్లో ఈఆర్‌పీ సాప్ సాఫ్ట్‌వేర్‌ను అత్యంత సమర్థవంతంగా వినియోగించినందుకు స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారాన్ని అందుకుంది.
 ‘ఒకే దేశం-ఒకే వేదిక’ నినాదంతో స్మార్ట్ ఇండియా లక్ష్యంగా స్కోచ్ ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో ఐటీ సంబంధిత కార్యక్రమాలపై పోటీలు నిర్వహిస్తోంది.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates